- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, గువాహతి నుంచి బీబీసీ కోసం
మణిపుర్లో మెయితెయి తెగ ఆధిపత్యంలోని తౌబాల్ జిల్లాలో కుకీ జోమి తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగికంగా వేధించిన ఘటనపై విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
ఈ ఘటన కిందటేడాది మే 4న జరగగా, దీనికి సంబంధించిన భయానక వీడియో జులై 19న వెలుగులోకి రావడంతో దేశంమొత్తం దిగ్భ్రాంతికి గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
ప్రతి ఒక్కరూ ఈ దుశ్చర్యను ఖండించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ చార్జిషీటులో వెలుగుచూసిన అంశాలు మరోసారి దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
మణిపుర్ హింసాకాండ: 9 నెలలైనా ఆరని మంటలు, ఈ చావులు గుండెల్ని తొలిచేస్తున్నాయంటోన్న బాధితులు- గ్రౌండ్ రిపోర్ట్
హ్యూమన్ రైట్స్ వాచ్: మైనారిటీలు, మహిళల పట్ల భారత్ వివక్ష చూపిస్తోందన్న 'వరల్డ్ రిపోర్ట్-2024'
మణిపుర్: ఎవరు శరణార్థి, ఎవరు చొరబాటుదారు? సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? - గ్రౌండ్ రిపోర్ట్
సీబీఐ చార్జ్షీట్లో ఏముంది?
ఈ మహిళలను గుంపు వెంబడిస్తుంటే వారు రోడ్డుపక్కన పార్క్ చేసిన పోలీసు జిప్సీ వాహనంలోకి చేరుకోగలిగారని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. వీరితోపాటు ఉన్న మరో బాధితుడు జిప్సీని త్వరగా పోనిమ్మని కోరగా, పోలీసు డ్రైవర్ ‘తన వద్ద తాళాలు లేవని చెప్పినట్టు’ చార్జిషీటులో తెలిపారు.
మణిపుర్ వైరల్ వీడియోకు సంబంధించిన సీబీఐ చార్జిషీటులో .. ‘‘పోలీసులు జిప్సీ దగ్గరకు వచ్చే సమయంలో బాధిత మహిళలను ఒకరి నుంచి మరొకరిని అల్లరి మూకలు వేరుచేశాయి. కానీ వారిద్దరూ ఎలాగో జిప్సీలోకి చేరుకోగలిగారు. ఆ సమయంలో జిప్సీలో డ్రైవర్ తో పాటు మరో పోలీసు ఖాకీ యూనిఫామ్లో ఉండగా, జిప్సీ బయట ముగ్గురు, నలుగురు పోలీసులు ఉన్నారు.
‘‘ఈ మహిళలతోపాటు ఉన్న మరో బాధితుడు కూడా జిప్సీలోకి చేరుకుని, వాహనాన్ని త్వరగా తీసుకుపోమ్మని కోరాడు. అయితే తన వద్ద తాళాలు లేవని డ్రైవర్ సమాధానమిచ్చాడు. తమకు సాయపడమని పదేపదే ముగ్గురు బాధితులు కోరినా, పోలీసులు ఎటువంటి సాయమూ అందించలేదు’’ అని చార్జిషీటులో తెలిపారు.
ఆ దాడిలో ఓ మహిళ సోదరుడిని, తండ్రిని చంపేశారు.
అల్లరి మూక పోలీసు జీపు నుంచి ఓ మహిళను బయటకు లాగిన సందర్భంలో అక్కడున్న పోలీసులందరూ ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినట్టు సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది.
జిప్సీ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన గుంపు, లోపలున్న వ్యక్తిని, ఇద్దరు మహిళలను బయటకు లాగారు. దీంతో బాధితులను అల్లరి మూకకు వదిలేసి పోలీసులు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. అయితే గుంపులోని కొంతమంది మాత్రం మహిళలను పోలీసు జీపులో కూర్చోమని చెప్పారని సీబీఐ చార్జిషీటులో వెల్లడించింది. కానీ అల్లరి మూక మహిళ ల బట్టలు చింపేయడమేకాక, వారితోపాటు ఉన్న వ్యక్తిని తీవ్రంగా కొట్టారని చార్జిషీటులో తెలిపారు.
నిజానికి కిందటేడాది అక్టోబర్ 16న సీబీఐ గువాహతి సీబీఐ స్పెషల్ జడ్జి కోర్టులో చార్జిషీటు ( క్రైమ్ నెంబర్ 110(06)/2023) దాఖలు చేసింది. ఆ సమయంలో సీబీఐ ఓ ప్రకటన విడుదల చేస్తూ మణిపుర్ వైరల్ వీడియో కేసుకు సంబంధించి ఓ బాలుడు సహా ఆరుగురు నిందితులపై స్పెషల్ జడ్జి ఎదుట చార్జిషీటు దాఖలు చేశామని పేర్కొంది.
మణిపుర్ ప్రభుత్వ విన్నపం మేరకు, భారత ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ మేరకు సీబీఐ ఈ కేసును కిందటేడాది విచారరణకు స్వీకరించింది.
ఆ సమయంలో థౌబల్ జిల్లా నాంగ్పాక్ సెక్మాయ్ పోలీసుస్టేషన్లో ఓ క్రిమినల్ కేసు నమోదైంది.
‘‘మే 4, 2023న సుమారు 900 నుంచి 1000మంది ఆయుధాలు ధరించిన గుంపు కాంగ్పోక్ప్కీ జిల్లాలోని బీ. ఫెనమ్ గ్రామంలో దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి ’’అని చార్జిషీటు దాఖలు చేసిన తరువాత సీబీఐ ఓ లిఖితపూర్వక ప్రకటనలో తెలిపింది.
ఆ గుంపు ఇళ్ళను ధ్వంసం చేసి, ఆస్తులను దోచుకుంది. గ్రామస్తులపై దాడి చేసింది, మహిళలను లైంగికంగా వేధించింది. బాధిత మహిళకు సంబంధించిన ఇద్దరు కుటుంబ సభ్యులను హత్య చేశారు. ఈ ఘటనలో చార్జిషీటులోని నిందితులకు ప్రమేయం ఉందని సీబీఐ తెలిపింది.
‘మేం వెనకడుగు వేయం’ - బీబీసీతో మణిపుర్ వైరల్ వీడియోలోని బాధిత మహిళలు
మణిపుర్: కుకీ, మెయితీల తర్వాత నాగాలు ఎందుకు వీధుల్లోకి వస్తున్నారు?
వీగిన అవిశ్వాస తీర్మానం.. మణిపుర్ మహిళలపై జరిగిన నేరాల గురించి ప్రధాని మోదీ ఏమన్నారు?
మణిపుర్ పోలీసులు ఏం చెబుతున్నారు?
పోలీసుల సమక్షంలోనే అల్లరి మూకలు నేరాలకు పాల్పడినట్టు సీబీఐ చార్జిషీటులో పేర్కొనడంపై అడిగిన ప్రశ్నకు మణిపుర్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ సింగ్ ‘‘ఈ ఘటన గురించి తెలియగానే స్టేషన్ ఇన్చార్జ్ సహా సంబంధిత పోలీసులందరిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకున్నాం. వీరందని మణిపుర్ పోలీసులే స్వయంగా అరెస్ట్ చేశారు’’ అని బీబీసీకి తెలిపారు.
‘‘తరువాత సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఇదో ఏడాదికిందటి కేసు. సీబీఐ ఇప్పుడు విచారణ జరుపుతోంది. నేరస్తులకు తగిన శిక్ష పడుతుంది. కానీ ఈ కేసులో మణిపుర్ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పడం సరికాదు’’ అని తెలిపారు.
నిజానికి ఇద్దరు మహిళలను లైంగికంగా వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగానే, నాంగ్పాక్ సెక్మాయ్ స్టేషన్ ఇన్చార్జ్ సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
కిందటేడాది జులైలో వెలుగుచూసిన ఈ వీడియో దేశవ్యాప్తంగా మంటలు రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన గుండె బరువెక్కిపోయిందని, ఈ ఘటన దేశానికే అవమానకరమని, నేరస్తులను ఉపేక్షించమని తెలిపారు.
ఆ వీడియోలని ఇద్దరు మహిళల్లో ఒకరి వయసు 20 ఏళ్ళు, మరొక మహిళ వయసు 40 ఏళ్ళు.
ఆ వీడియోలో ఓ గుంపు వీరిద్దరిని నగ్నంగా మార్చి పొలాల వైపు తరుముతున్న దృశ్యం ఉంది. కొంతమంది వారిని లైంగికంగా వేధించినట్టు కూడా అందులో కనిపిస్తోంది.
మణిపుర్లో తెగల హింసకు సంబంధించి మొత్తం 11 కేసులను విచారిస్తున్న సీబీఐ, ఇతర ప్రాంతాలలో కూడా అనేక ఘటనలు జరిగినట్టు తెలిపింది. అల్లరి మూకలు ఇళ్ళను తగులబెట్టి, గ్రామాలపై దాడులు చేశారని చార్జిషీటులో పేర్కొంది.
మే 4న మెయితెయి గ్రామ పెద్దలు, ఇతర పెద్దల మధ్య సమావేశం జరిగిందని, కానీ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అల్లరి గుంపులు సమీప గ్రామాలలోని ఇళ్ళను చర్చ్లను తగులబెట్టాయి.
సామూహిక అత్యాచారం, హత్య, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, నేరపూరిత కుట్ర కు సంబంధించిన సెక్షన్ల కింద నిందితులపై అభియోగాలు మోపారు.
సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిన నిందితుడిని హూరెమ్ హెరోదాస్ మైతీ (32)గా గుర్తించారు. ఆయనను జులై 20న మణిపుర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరితోపాటుగా అరెస్టయిన అరుణ్ ఖుండోంగ్బామ్ అలియాస్ నానావో (31), నింగోంబం టోంబాసింగ్ అలియాస్ టోంథిన్ (18), ఫుఖ్రీ హోంంగ్బామ్ సూరంజోయ్ మెయితీ (24), నమిరక్పామ్ కిరం మెయితీ (30),తో పాటు ఓ మైనర్ పై చార్జ్ షీటు దాఖలు చేశారు.
మణిపుర్ హింసపై వస్తున్న వార్తల్లో ఏది నిజం, ఏది అబద్ధం?
మణిపుర్ హింస: మహిళలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? -బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
మణిపుర్ హింస: అసలేమైంది? ఎందుకు ఇదంతా జరుగుతోంది?
కోర్టు కమిషన్ ఎక్కడిదాకా వచ్చింది?
కేంద్ర హోం మంత్రిత్వశాఖ కిందటేడాది జూన్లో ముగ్గురు సభ్యులతో విచారణా కమిటీని నియమించింది. గువాహటి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజయ్ లాంబ నేృత్వంలో మణిపుర్లో కొనసాగుతున్న కుల ఘర్షణలపై సమగ్ర విచారణకు కమిటీని వేసింది.
ప్రస్తుతం కమిటీ సభ్యులు బాధిత కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. త్వరలోనే బాధిత ప్రాంతాలలో బహిరంగ విచారణ కూడా జరపనున్నారు.
పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి బీబీసీతో మాట్లాడుతూ ‘‘న్యాయ ప్రక్రియ ప్రకారం కమిషన్ మణిపుర్ హింసపై విచారణ జరుపుతోంది. ఇప్పటిదా 11వేలకుపైగా బాధితుల నుంచి ప్రమాణపత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా అనేక తీవ్ర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇవ్వన్నీ మీడియాలో కూడా బహిర్గతం కానివి. వీటిపై బహిరంగ విచారణ ప్రారంభం కావాల్సి ఉంది’’ అని చెప్పారు.
మే 4న నగ్నంగా ఊరేగించిన మహిళల నుంచి కూడా కమిషన్ సాక్ష్యాలు తీసుకుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఖద్దరుపై మనసు పడుతున్న కలెక్టర్లు... ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఎన్నికల కథనాల కోసం ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నారా... ఇక నుంచి ఇది తప్పనిసరి
- ‘మా నాన్న సీఎం’
- మనలో ‘రెండో గుండె’ ఉందని మీకు తెలుసా? అది ఎలా పని చేస్తుందంటే...
- వ్లాదిమిర్ కొమరోవ్: అంతరిక్షం నుంచి కిందపడి మరణించిన తొలి వ్యోమగామి ఇతనే...
- ప్రజ్వల్ రేవణ్ణ ‘సెక్స్ వీడియో’ కేసు: దేవెగౌడ మనవడిపై ఫిర్యాదు చేసిన పనిమనిషి ఏం చెప్పారు?
బీబీసీ తెలుగునుఫేస్బుక్ఇన్స్టాగ్రామ్,ట్విటర్లో ఫాలో అవ్వండి.యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)